Karnataka: ఒక్క క్షణం కూడా పనిచేయలేను.. పదవికి మరో ఐఏఎస్ అధికారి రాజీనామా!

  • కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘటన
  • డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సెంథిల్
  • ప్రజల్ని క్షమాపణలు కోరిన డిప్యూటీ కమిషనర్

ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కలత చెందిన మరో ఐఏఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. భారత ప్రజాస్వామ్య పునాదులు ఎన్నడూ లేనంత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ సర్వీసు నుంచి బయట ఉండటమే మంచిదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్.శశికాంత్ సెంథిల్ అనే అధికారి దక్షిణ కన్నడ జిల్లాకు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన 2009లో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. అయితే ఇటీవల దేశంలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలతో కలత చెందిన శశికాంత్ సెంథిల్, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయమై ఆయన స్పందిస్తూ..‘ప్రజాస్వామ్య ప్రాథమిక పునాదులు అసాధారణ  రీతిలో దెబ్బతిన్న వేళ ఓ ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికమని భావిస్తున్నాను. నా రాజీనామాతో ఏ వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు.  రాబోయే రోజుల్లో మన దేశపు సమాజంలోని మౌలిక స్వరూపానికి తీవ్రమైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయని నాకు అనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా కంటే బయట ఉండటమే మంచిదనీ, అప్పుడే నా పనులను స్వేచ్ఛగా చేసుకోగలనని భావిస్తున్నా. ఇక నేను ఎంతమాత్రం సర్వీసులో కొనసాగలేను. విధుల నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నందుకు ప్రజలు నన్ను క్షమించాలి’ అని వ్యాఖ్యానించారు. కొన్నిరోజుల క్రితం దాద్రనగర్ హవేలీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కణ్ణన్ గోపీనాథ్.. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు.

More Telugu News