Telangana: యాదాద్రి ఆలయం స్తంభాలపై కేసీఆర్ బొమ్మలపై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్!

  • ఈ విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా?
  • ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
  • వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రాకారంలోని మండప స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రం చెక్కడం కొన్ని పత్రికల్లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కేసీఆర్ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కుతున్నారని రాజాసింగ్ విమర్శించారు.

ఈ విషయం కేసీఆర్ కు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ తనను తాను భగవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వీటిని తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

ఏంతో ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో గుడి కడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు. ఈ విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News