Jagan: చౌక ధరల దుకాణాల్లో 'స్వర్ణ' వంటి బియ్యం... శ్రీకాకుళం నుంచి పైలట్ ప్రాజెక్టు: వైఎస్ జగన్

  • బియ్యం కుమ్ముకునే పరిస్థితి ఉండదు
  • ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
  • క్వాలిటీతో ఉన్న బియ్యం ఇంటికే వస్తుందన్న జగన్

చౌక ధరల దుకాణాల్లో ప్రజలు తీసుకుంటున్న బియ్యాన్ని తిరిగి రూపాయి, రెండు రూపాయలకు విక్రయించుకుంటున్న పరిస్థితిని పోగొడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వారి నుంచే కొనుగోలు చేస్తున్న డీలర్లు, తిరిగి దాన్నే ప్రభుత్వానికి అమ్ముతున్నారని, ప్రభుత్వం మళ్లీ ఆ బియ్యాన్నే ప్రజలకు అందిస్తోందని, ఇకపై ఇలా జరగదని చెప్పారు.

ప్రజలకు 'స్వర్ణ' రకం వంటి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించడం ప్రారంభిస్తామని, ఆరు నెలల పరిశీలన అనంతరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రతి పేదకూ ఆకలి తీరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, క్వాలిటీ పెంచిన బియ్యాన్ని ప్రతి ఒక్కరికీ దగ్గర చేస్తానని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ బియ్యం ప్రతి లబ్దిదారుని గడపకూ చేరుతుందని చెప్పారు.

More Telugu News