Crime News: మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌ లేఖ!

  • వివేకా హత్య కేసులో కీలక ఆధారాల కోసం పోలీసుల అడుగులు
  • అది మృతుడు రాసిందేనా? ఎవరైనా సృష్టించారా? అన్నదానిపై ఆరా
  • స్వయంగా కడపకు వచ్చి కేసు సమీక్షించిన డీజీపీ

ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన సాక్ష్యాల కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు. ముఖ్యంగా కేసులో అనుమానితుడైన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య, ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖపై పోలీసులు దృష్టిపెట్టారు. లేఖను శ్రీనివాసులురెడ్డి రాశాడా? ఎవరైనా క్రియేట్‌ చేశారా? అన్నది నిర్ధారించేందుకు దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న డీజీపీ గౌతం సవాంగ్‌ బుధవారం కడప చేరుకుని నిన్నటి వరకు అక్కడే గడిపారు. ఈ కేసుకు సంబంధించి పలు అంశాలపై సమీక్షించిన ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అవసరమైన సూచనలు చేశారు.

డీజీపీ పర్యటన అంతా రహస్యంగా సాగడం, పోలీసులు దీనిపై నోరు మెదపక పోవడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కీలక అనుమానితులుగా భావిస్తున్న నలుగురిని కొన్ని రోజుల క్రితం నార్కో అనాలసిస్‌ పరీక్షల కోసం గుజరాత్‌ తీసుకువెళ్లారు. అక్కడ కీలక సమాచారం వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇది జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడం మిస్టరీగా మారింది.

శ్రీనివాసులురెడ్డి కేవలం అనుమానితుడు మాత్రమే. అతనిపై కేసు కూడా నమోదు కాలేదు. అలాంటప్పుడు అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది మిస్టరీగా ఉంది. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్న నేపథ్యంలో అతనితో ఎవరైనా బలవంతంగా విషం మింగించారా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. లేఖలో అక్షరాలు ఒక్కోచోట ఒక్కోలా ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు.

More Telugu News