Uttar Pradesh: బిల్లు ఎక్కువగా వేశారని కస్టమర్ గొడవ.. కొట్టి చంపేసిన హోటల్ యజమాని!

  • ఉత్తరప్రదేశ్ లోని బదోమీలో ఘటన
  • రూ.180 బిల్లు వేసిన హోటల్ ఓనర్
  • వాగ్వాదానికి దిగిన ఇద్దరు యువకులు

హోటల్ బిల్లు చెల్లించలేదనే కారణంతో ఓ యజమాని రాక్షసుడిగా మారిపోయాడు. తన సిబ్బందితో కలిసి కస్టమర్లపై రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దుర్ఘటనలో ఓ కస్టమర్ చనిపోవడంతో సదరు హోటల్ సిబ్బంది పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోమీ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బదోమీ పట్టణంలో సూరజ్, విశాల్ అనే ఇద్దరు యువకులు ఓ దాబా హోటల్ కు వచ్చారు. భోజనం తిన్నాక యజమాని రూ.180 బిల్ వేశాడు. అయితే తాము తిన్నదానికి ఇది చాలా ఎక్కువని ఇద్దరు యువకులు వాదనకు దిగారు. ఈ వాగ్వాదం ముదరడంతో సహనం కోల్పోయిన యజమాని గుర్మయిల్, అతని కుమారుడు సరేంద్ర తమ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి దిగారు. రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.

ఈ దాడి నుంచి విశాల్ తప్పించుకోగా, సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుర్మయిల్ తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేశారు. గుర్మయిల్, సురేంద్రలను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News