Telugudesam: విమర్శించడం తప్ప ఒక్కటైనా నిరూపించారా?: లోకేశ్

  • టీడీపీపై విమర్శలు చేస్తూ హామీలు అమలు చేయడం లేదు
  • పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది
  • స్వప్రయోజనాల కోసమే కొందరు పార్టీ మారుతున్నారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని విమర్శించడం తప్ప ఒక్కటైనా నిరూపించలేకపోయారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూ నవరత్నాలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని స్వయంగా కేంద్రమే చెప్పిందనీ, అయినప్పటికీ వైసీపీ మాత్రం టీడీపీని విమర్శిస్తూనే ఉందని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోందని దుయ్యబట్టారు. లేనిపోని రాద్ధాంతం చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారని అన్నారు. వైసీపీ నేతలు కులాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని ఆరోపించారు. టీడీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమేనని లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News