DK shivkumar: డీకేను మరింత విచారించాల్సి ఉంది.. 14 రోజుల కస్టడీ ఇవ్వండి: కోర్టును కోరిన ఈడీ

  • గత నెల 30న ప్రారంభమైన విచారణ
  • నిన్నటితో పూర్తికావడంతో అరెస్ట్
  • గత రాత్రి నుంచి ఛాతినొప్పితో బాధపడుతున్న డీకే

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఇంకా విచారించాల్సి ఉందని, కాబట్టి 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. నిన్న రాత్రి నుంచి ఛాతినొప్పితో బాధపడుతున్న డీకేను బెంగళూరులోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ రోజు ఆసుపత్రి నుంచి శివకుమార్‌ను నేరుగా ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది మాట్లాడుతూ విచారణ కీలక దశలో ఉందని, కాబట్టి ఆయనను 14 రోజులు కస్టడీకి అప్పగిస్తే విచారించి మరిన్ని వివరాలు రాబడతామని కోర్టుకు తెలిపారు. కాగా, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకేను గత నెల 30 నుంచి విచారిస్తున్నారు. నిన్నటితో విచారణ పూర్తి అయింది.

అయితే, విచారణలో ఆయన తమకు సహకరించలేదని, కాబట్టి మరింత లోతుగా విచారించేందుకే అరెస్ట్ చేసినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు, డీకే అరెస్ట్‌కు నిరసనగా బుధవారం రాష్ట్రబంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పది బస్సులను తగులబెట్టారు.

More Telugu News