Revuri Prakash Reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన టీటీడీపీ, కాంగ్రెస్ నేతలు

  • బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, రవీంద్ర నాయక్
  • కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, లక్ష్మణ్
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ అమలు చేయడం లేదని లక్ష్మణ్ విమర్శ

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు.

కార్యక్రమం అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యూరియా కొరతను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియాను ఇవ్వడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కేంద్రంపై నెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని అన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి, రైతు సమస్యలను కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

More Telugu News