Crime News: శంషాబాద్‌లో విమానం దిగి ఇంటికి వెళ్తున్న ప్రయాణికుడి అదృశ్యం

  • బ్రిటన్‌ నుంచి వచ్చి క్యాబ్‌లో బయలుదేరిన ప్రవీణ్‌ అనే యువకుడు
  • మధ్యలో తన లగేజీ లాక్కుని వదిలేశారని కుటుంబ సభ్యులకు ఫోన్‌
  • ఆ తర్వాత అతని ఆచూకీ కరవు

బ్రిటన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఓ యువకుడు అనంతరం కనిపించకుండా పోయాడు. విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో బయలుదేరిన అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తి బ్రిటన్‌ నుంచి విమానంలో భారత్‌కు బయలుదేరాడు. ఇతను ప్రయాణించిన విమానం నిన్న అర్ధరాత్రి తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. అనంతరం ప్రవీణ్ క్యాబ్‌ బుక్‌ చేసుకుని తన సొంత ప్రాంతానికి బయలుదేరాడు. అయితే రాత్రి 2 గంటల సమయంలో ప్రవీణ్‌ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌ వచ్చింది. కొందరు వ్యక్తులు తన కారును అటకాయించి లగేజీ లాక్కుని తనను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారని ఫోన్‌లో తెలిపాడు.

ఈ ఫోన్‌ తర్వాత నుంచి ప్రవీణ్‌ ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన బంధువులు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నా అతని జాడ ఇంకా దొరకలేదు.

More Telugu News