London: లండన్ లోని భారత దౌత్య కార్యాలయం ముందు పాకిస్థానీయుల విధ్వంసం!

  • మరోసారి హింసాత్మక ఘటనలు
  • పగిలిన కిటికీలు, వాహనాల అద్దాలు
  • కేసులు పెట్టామన్న లండన్ మేయర్

లండన్ లోని భారత దౌత్య కార్యాలయం ముందు పాకిస్థానీ మద్దతుదారులు విధ్వంసానికి దిగారు. కార్యాలయం పైకి రాళ్లను విసిరి అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాహనాలపైనా విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని భారత యూకే అంబసీ, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. "భారత హై కమిషన్ కార్యాలయం ముందు మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆస్తి నష్టం సంభవించింది" అని పేర్కొంది.

జరిగిన నిరసనలపై లండన్ మేయర్ సాధిక్ ఖాన్ స్పందిస్తూ, ఈ తరహా చర్యలను తాము ఉపేక్షించబోమని అన్నారు. పోలీసులు ఆందోళన కారులపై కేసులను నమోదు చేశారని చెప్పారు. కాగా, పాకిస్థాన్ మద్దతుదారులు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లను దౌత్య కార్యాలయంపైకి విసిరివేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో కొన్ని కిటికీలు, వాహనాల అద్దాలు పగిలాయని తెలిపారు. గత నెల 15వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో పాక్ జాతీయులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

More Telugu News