Gujarath: నడిరోడ్డుపై ఆగిపోయిన జీపు.. కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓనర్!

  • గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
  • టిక్ టాక్ లో వీడియో వైరల్
  • యజమాని, స్నేహితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మనం వెళుతున్న బండి సడెన్ గా రోడ్డుపై ఆగిపోతే ఏం చేస్తాం. మహాఅయితే స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంజిన్ లో ఏమైనా సమస్య వచ్చిందేమో చెక్ చేస్తాం. అయితే ఫలితం లేకుంటే మెకానిక్ కు కాల్ చేస్తాం. కానీ గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన ఇంద్రజిత్ జడేజా అనే వ్యాపారి మాత్రం వింతగా ప్రవర్తించాడు. తన జీపు నడిరోడ్డుపై ఆగిపోవడంతో చిర్రెత్తుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడితో ఆగకుండా ఈ నిర్వాకాన్ని వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు.

రాజ్ కోట్ లో ఇంద్రజిత్ కు ఆటోమొబైల్ షాపుతో పాటు పలు పార్లర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతను వెళుతున్న జీపు రోడ్డుపై ఆగిపోవడంతో సహనం కోల్పోయిన ఇంద్రజిత్ దానికి నిప్పంటించాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిందితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇంద్రజిత్ తో పాటు వీడియోను షూట్ చేసిన అతని స్నేహితుడు నిమిష్ ను అరెస్ట్ చేశారు. కాగా, గణేశుడి ఊరేగింపు కోసం స్నేహితులు ఈ జీపును అడిగారనీ, అయితే వాహనం ట్రబుల్ ఇవ్వడంతో తన పరువు పోయిందని భావించిన ఇంద్రజిత్ జీపుకు మంటపెట్టాడని పోలీసులు తెలిపారు.

More Telugu News