Odisha: కన్నతండ్రే కాలయముడు...ఏడుస్తున్నాడని ఆరేళ్ల బిడ్డను బండకేసి బాది చంపేశాడు

  • ఏడుపు మానాలన్నా ఆపకపోవడంతో ఆగ్రహం
  • ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఘటన
  • భార్య పుట్టింటిలో ఉండగా దారుణం

కన్న తండ్రే కొడుకు పట్ల కాలయముడయ్యాడు. గుక్కపట్టి ఏడుస్తున్న ఆరేళ్ల కొడుకు చెప్పినా ఆపడం లేదన్న కోపంతో బండకేసి బాది హత్య చేశాడు. ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్‌ జిల్లా శరత్‌ ఠాణా పరిధిలోని లావణ్యదెయపూర్‌లో ఈ దారుణం నిన్న చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...గ్రామానికి చెందిన మధుసింగ్‌కు ఇద్దరు కొడుకులు. కొన్నాళ్ల క్రితం భర్తతో గొడవపడి ఇతని భార్య పెద్ద కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి చిన్న కొడుకు సర్దార్‌సింగ్‌ తండ్రితోనే ఉంటున్నాడు. నిన్న పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన మధుసింగ్‌కు సర్దార్‌సింగ్‌ ఏడుస్తూ కనిపించాడు. ఏడుపు ఆపమని చెపుతున్నా అతను గుక్కపట్టి ఏడవడంతో తట్టుకోలేక బాలుడిని పైకెత్తి నేలకేసి కొట్టడు. దీంతో గాయపడిన సర్దార్‌ మరింత ఏడవడంతో గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న బండకేసి కొట్టాడు. అడ్డుకున్న గ్రామస్థులపైనా దాడి చేశాడు. దీంతో మధును చుట్టుముట్టి పట్టుకున్న స్థానికులు అతడిని తాళ్లతో కట్టేశారు. అనంతరం బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మధుసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News