dhanush: కోలీవుడ్ నటుడు ధనుష్‌పై మండిపడుతున్న నిర్మాతలు

  • నిర్మాతల నుంచి పారితోషికం తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందన్న ధనుష్
  • ధనుష్ నుంచి సహకారం అందడం లేదన్న నిర్మాతలు
  • ధనుష్ కారణంగా కొందరు నిర్మాతలు సినీ రంగానికే దూరమయ్యారని ఆవేదన

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు నటులను మోసం చేస్తున్నారని, వారి నుంచి పారితోషికం తీసుకోవడానికి ముప్పుతిప్పలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. పారితోషికం కోసం వారి చుట్టూ తిరుగుతూ ఇతర పనులను వదిలిపెట్టుకోవాల్సి వస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధనుష్ వ్యాఖ్యలపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్, అజిత్ వంటి అగ్రనటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని నిర్మాత ఏఎల్ అళగప్పన్ పేర్కొన్నారు. ధనుష్ నుంచి సహకారం లేకపోవడంతో నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ధనుష్‌కు హితవు పలికారు. ధనుష్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారిలో చాలామంది ఈ రంగం నుంచే తప్పుకున్నట్టు తెలిపారు. మరో నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ. ధనుష్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పది కోట్ల రూపాయలతో తీసిన సినిమాను రూ.8 కోట్లకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News