Tamil Nadu: కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదట.. జరిమానా వడ్డింపు!

  • తమిళనాడులోని తిరుప్పూరులో ఘటన
  • ట్రాఫిక్ పోలీసులు పంపిన మెసేజ్ చూసి విస్తుపోయిన సెల్వకుమార్
  • ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తానన్న బాధితుడు

ట్రాఫిక్ పోలీసులు ఎవరినీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ జరిమానా విధించారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందీ ఘటన. ఎన్‌ఆర్‌కే పురానికి చెందిన సెల్వకుమార్ (45) ఓ బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరు నుంచి తిరుప్పూరు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మొబైల్‌కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో కారు నంబరు పేర్కొంటూ.. ఈ కారులో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు జరిమానా చెల్లించాలని ఆ మెసేజ్‌లో ఉంది. ఇది చూసిన సెల్వకుమార్ విస్తుపోయారు. కారులో వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా ఏంటంటూ నివ్వెరపోయారు. త్వరలోనే ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సెల్వకుమార్ పేర్కొన్నారు.

More Telugu News