Pawan Kalyan: ఇప్పుడు పవన్ కల్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లే నిజమైన జనసైనికులు: పరుచూరి పలుకులు

  • పవన్ స్పష్టమైన ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడన్న పరుచూరి గోపాలకృష్ణ
  • సమాజం బాగుండాలని కోరుకునేవాళ్లలో పవన్ ఒకడంటూ కితాబు
  • గెలిస్తే తాను ఏంచేస్తాడో పవన్ ప్రజలకు వివరంగా చెప్పాలన్న పరుచూరి

ప్రముఖ సినీ రచయిత, పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. పరుచూరి పలుకులు వీడియోలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడని, సమాజం బాగుండాలని కోరుకునే అతి కొద్దిమందిలో పవన్ కల్యాణ్ కూడా ఒకడని అన్నారు. గెలిచినప్పుడు మనవాళ్లు ఎవరో తెలియదని, ఎవరెవరో చుట్టూ మూగుతుంటారని, కానీ ఓడిపోయినప్పుడు మన చుట్టూ నిలిచినవాళ్లే మనవాళ్లని, ఇప్పుడు పవన్ కల్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లే నిజమైన జనసైనికులని పరుచూరి అభిప్రాయపడ్డారు.

కిందపడినా రెట్టించిన పట్టుదలతో పైకిలేచే లక్షణం పవన్ లో ఉందని, సినీ రంగంలో ఎలా పుంజుకున్నారో, రాజకీయాల్లోనూ అదేవిధంగా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో మంచివాళ్ల కొరత నెలకొందని, పవన్ వంటి వాళ్ల అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి పవన్ కల్యాణ్ తాను గెలిస్తే ఏం చేస్తాడన్నది జనాలకు వివరంగా చెప్పాలని, తాము కోరుకునేది అదేనని పరుచూరి గోపాలకృష్ణ స్పష్టం చేశారు.

More Telugu News