India: భారత్ చేతికి మరో అస్త్రం.. వాయుసేనలో చేరిన 8 అపాచి అటాక్ హెలికాప్టర్లు!

  • పాక్ పీచమణిచేలా అపాచి హెలికాప్టర్లు సిద్ధం
  • 22 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చిన భారత్
  • రాత్రిపూట కూడా దాడిచేయగల సత్తా భారత్ సొంతం

భారత అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రం చేరింది. సరిహద్దులో ఉగ్రస్థావరాలను ఏర్పాటుచేసి ఉగ్రదాడులకు తెగబడుతున్న పాక్ పీచమణిచేలా చేసేందుకు అత్యాధునిక అపాచి ఏహెచ్-64 అటాక్ హెలికాప్టర్లు భారత వైమానికదళం(ఐఏఎఫ్)లో చేరాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది.

అమెరికా నుంచి 22 అపాచి అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2015లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 8 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ భారత్ కు అందించింది. ఈ అత్యాధునిక హెలికాప్టర్లను అమెరికా వాయుసేన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతోంది. ఇద్దరు పైలెట్లు నడిపే ఈ అపాచి హెలికాప్టర్ ను రాత్రిపూట నడిపేందుకు నైట్ విజన్ సౌకర్యం ఉంది.

అలాగే శత్రువులను లక్ష్యంగా చేసుకునేందుకు 30 ఎంఎం ఎం230 చైన్ గన్ ను అమర్చారు. ఈ హెలికాప్టర్ల ద్వారా ఏజీఎం 114, హైడ్రా 70 మిస్సైళ్లను ప్రయోగించవచ్చు. ప్రస్తుతం అమెరికాతో పాటు జపాన్, ఇజ్రాయెల్, సింగపూర్, యూఏఈ ఈ హెలికాప్టర్ ను వాడుతున్నాయి. అన్నట్లు ఒక్కొక్క అపాచి హెలికాప్టర్ ను రూ.256.43 కోట్లకు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ అమ్ముతోంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అపాచి హెలికాప్టర్లు గరిష్టంగా 500 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాయి.

More Telugu News