Chandrababu: పల్నాడు వైసీపీ బాధితులకు గుంటూరులో పునరావాసం... చంద్రబాబు సంచలన ప్రకటన!

  • వైసీపీ దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది
  • పల్నాడులోని బాధితుల కోసం ప్రత్యేక కేంద్రం
  • తానే స్వయంగా కాపలా ఉంటానన్న చంద్రబాబు
  • నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తరువాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు పెరిగిపోయాయని, వారి దాడుల కారణంగా నష్టపోయిన వారి కోసం గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నానని మాజీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈ ఉదయం పల్నాడు ప్రాంత నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నాయకత్వంలోని స్థానిక నేతలు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలంతా చూస్తూనే ఉన్నారని అన్నారు.

పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు, గుంటూరులోని అరండల్ పేటలో పునరావాస కేంద్రం ఉంటుందని, ఎవరైనా ఇక్కడకు వచ్చి ఉండవచ్చని, వారందరికీ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గడచిన మూడున్నర నెలలుగా రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, హత్యలు, ఆస్తుల విధ్వంసానికి లెక్కే లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూముల కబ్జాలు, దాడులు, వేధింపులు, అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

పునరావాస కేంద్రానికి వచ్చే వారికి అన్ని సౌకర్యాలనూ దగ్గర చేస్తామని, పరిస్థితులు కుదుట పడేవరకూ వారు ఇక్కడే ఉండవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికీ ఉందని, కానీ ఆ హక్కులను ప్రభుత్వమే కాలరాయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు కూడా విఫలం అవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో పోలీసులు కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని, బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, బాధితులు ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చని సూచించారు. ఆపై తానే స్వయంగా వారి వారి గ్రామాలకు తీసుకుని వెళ్లి, కాపలాగా ఉంటానని అన్నారు.

More Telugu News