New Delhi: సాయంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే ఫ్రిజ్ లో పెట్టి కిడ్నాప్ చేశాడు!

  • ఢిల్లీలో ఘటన
  • కిషన్ అనే యువకుడ్ని పనిలో పెట్టుకున్న వృద్ధ దంపతులు
  • యజమానిని ఫ్రిజ్ లో కుక్కి లారీలో వేసుకుని వెళ్లిన పనిమనిషి

ఢిల్లీలో ఓ పనిమనిషి తన యజమానినే కిడ్నాప్ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో నివసించే కృష్ణ ఖోస్లా (92) ఓ రిటైర్డ్ ఉద్యోగి. తన భార్యతో కలిసి నివసిస్తున్న ఆయన తమకు చేదోడువాదోడుగా ఉంటాడని కిషన్ అనే యువకుడ్ని పనిమనిషిగా కుదుర్చుకున్నారు. అయితే, కిషన్ ఒకరోజు మినీ లారీతో ఖోస్లా నివాసానికి వచ్చాడు. అతని వెంట మరికొందరు వ్యక్తులు కూడా వచ్చారు. ఖోస్లా దంపతులకు వారు మత్తుమందు ఇవ్వడంతో వారు వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఆపై, ఖోస్లాను వారు ఓ ఫ్రిజ్ లో కుక్కి తాము తీసుకువచ్చిన మిని లారీలో వేసుకుని వెళ్లిపోయారు.

మరుసటి రోజు ఉదయానికి గానీ ఖోస్లా భార్య మత్తు నుంచి తేరుకోలేకపోయింది. భర్త కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. కొందరు వ్యక్తులు ఫ్రిజ్ ను మినీ లారీలో తరలించడం అందులో రికార్డయింది. దానికితోడు కిషన్ కూడా కనిపించకపోవడంతో ఇది అతడి పనే అని నిర్ధారించారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు. వృద్ధుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తన పట్ల ఖోస్లా దంపతులు వ్యవహరిస్తున్న తీరుకు ప్రతీకారంగానే కిషన్ ఈ కిడ్నాప్ కు తెగించినట్టు భావిస్తున్నారు.

More Telugu News