India: మళ్లీ విధుల్లోకి చేరిన అభినందన్.. ఐఏఎఫ్ చీఫ్ ధనోవాతో కలిసి మిగ్-21లో చక్కర్లు!

  • పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో విహారం
  • 30 నిమిషాలు విహరించిన అభినందన్, ధనోవా
  • అభినందన్ తండ్రితో కలసి పనిచేశానన్న ఐఏఎఫ్ చీఫ్  

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ విధుల్లో చేరారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానంలో విహరించారు. విమానం ముందు భాగంలో ధనోవా కూర్చోగా, అభినందన్ మిగ్-21 వెనుక భాగంలో కూర్చున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో టేకాఫ్ తీసుకున్న ఈ మిగ్ ట్రైనీ విమానం దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించింది. ఈ విహారం అనంతరం ధనోవా మీడియాతో మాట్లాడుతూ.. తాను అభినందన్ వర్థమాన్ తండ్రితో కలిసి పనిచేశానని తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత విమానాలు బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు దూసుకురాగా, అభినందన్ ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం దెబ్బతినడంతో పాక్ సైన్యానికి దొరికిపోయారు. అయితే భారత్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్ ను పాక్ సురక్షితంగా విడిచిపెట్టింది.

More Telugu News