Andhra Pradesh: తలుచుకుంటే గంటా శ్రీనివాసరావును విశాఖలోనే లేకుండా చేస్తా!: మంత్రి అవంతి ఘాటు వార్నింగ్

  • గంటా ఓ రాజకీయ వ్యభిచారి
  • ఏ పార్టీలో ఉన్నాడో అతనికే తెలియదు
  • విశాఖలో మీడియాతో వైసీపీ నేత

తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు ఓ రాజకీయ వ్యభిచారి అని ఏపీ టూరిజం శాఖ మంత్రి, వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ కార్యకర్తల కష్టంతో ఐదేళ్లు మంత్రి పదవి అనుభవించిన గంటా, ఈరోజు మళ్లీ పార్టీ మారేందుకు చూస్తున్నారనీ, ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుందని అవంతి ప్రశ్నించారు.

లోక్ సభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశాకే తాను మరో పార్టీలో చేరాననీ, తనపై పోటీకి లోకేశ్, చంద్రబాబు, గంటాలను ఆహ్వానించానని గుర్తుచేశారు. వైసీపీ తరఫున టీడీపీ నేతలను సవాలు చేసి మరీ మగాడిలా గెలిచానని వ్యాఖ్యానించారు. అవంతిని తాను మంత్రిగానే గుర్తించడం లేదని గంటా చెప్పిన నేపథ్యంలో విశాఖపట్నంలో ఈరోజు మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

‘వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా కక్ష, పగ లేవు. నేను ఏదైనా మొహం మీద మాట్లాడుతా. దొడ్డిదారిన ప్రయత్నాలు చేయడం నాకు చేతకాదు. గంటా వ్యక్తిత్వం అంటే నాకు కోపం. రాజకీయాల్లోకి వచ్చినోడు ప్రజలకు, నమ్మిన అనుచరులకు, పార్టీకి జవాబుదారీగా ఉండాలి. అసలు ఎవరైనా నమ్ముతారా నిన్ను(గంటాను)? నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమందిని మోసం చేశావ్? ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో కూడా నీకు తెలుసా? ఈ విషయంలో ఓసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.

దురహంకారంతో మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమన్నా మంత్రివా? లేక నీ బాబు, నీ తాత మంత్రులుగా ఉన్నారా? నువ్వూ కష్టపడి మాలాగే పైకి వచ్చావ్. నేను అయ్యన్న అంత మంచివాడిని కాదు. నా పేరు ఎత్తితే గంటా విశాఖలో ఉండలేడు. అతని చరిత్ర మొత్తం బయటపెడతా. తలచుకుంటే అతడిని విశాఖలోనే లేకుండా చేస్తా’ అని మంత్రి అవంతి ఘాటుగా హెచ్చరించారు.

More Telugu News