Anantapur District: అనంతపురం ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ క్యాంపు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడులు

  • కొత్తపల్లి వద్ద క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసిన ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ
  • కార్యాలయంలో ప్రవేశించి సామగ్రి ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్సార్ కన్ స్ట్రక్షన్ ప్రతినిధులు

అనంతపురం జిల్లాలో ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ క్యాంపు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆత్మకూరు మండలం కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన వైసీపీ శ్రేణులు అక్కడ ఉన్న టిప్పర్ల అద్దాలు పగులగొట్టారు. కార్యాలయంలో ప్రవేశించి సామగ్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతోంది.

అయితే కొన్నిరోజుల కిందట కొందరు వ్యక్తులు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనుచరులమంటూ వచ్చి రహదారి పనులు నిలిపివేయాలంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు పనులు నిలిపివేసినా మళ్లీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సార్ కన్ స్ట్రక్షన్ సంస్థ కార్యాలయంపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News