Alla Ramakrishna Reddy: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాయడం ఏంటి... మతిభ్రమించినట్టుంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • వరదలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
  • డ్రోన్ వెళ్లింది వరద చిత్రీకరణ కోసమేనంటూ వివరణ
  • చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ రాజధానిలో పర్యటించారంటూ ఆరోపణ

మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. వరదల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చూస్తుంటే చంద్రబాబుకు మతిభ్రమించినట్టుగా అనిపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. రాజధానిలో రైతులెవరూ ఆందోళన చేయడంలేదని, రాజధానిలో భూములు కొన్న చంద్రబాబు మనుషులే ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు తన లేఖలో డ్రోన్ విషయాన్ని పేర్కొనడాన్ని ఆళ్ల తప్పుబట్టారు. వాస్తవానికి డ్రోన్ వెళ్లింది వరద చిత్రీకరణ కోసమేనని స్పష్టం చేశారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ పైనా ఆళ్ల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించారని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై పవన్ ఎక్కడా మాట్లాడలేదన్న విషయాన్ని గమనించాలని అన్నారు.

More Telugu News