Ganta Srinivasa Rao: రాజధానిపై బొత్స పదేపదే మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది: గంటా విమర్శలు

  • రాజధాని అంశంపై స్పందించిన గంటా
  • టీజీ, సుజనా, కన్నా కూడా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వెల్లడి
  • జగన్ నేరుగా ప్రకటన చేయాలంటూ డిమాండ్

ఏపీ రాజధాని అమరావతి అంశం ఇంకా రగులుతూనే ఉంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడు మాట్లాడినా అమరావతి విషయమే కేంద్ర బిందువు అవుతోంది. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. రాజధానిపై బొత్స పదేపదే మాట్లాడుతుండడం విడ్డూరంగా అనిపిస్తోందని అన్నారు. టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజధానిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖ అంటూ కొందరు మేధావులు కూడా మాట్లాడుతున్నారని తెలిపారు.

ప్రజలను గందరగోళంలోకి నెట్టేలా మాట్లాడడం సరికాదని గంటా హితవు పలికారు. ఇది మరో ఉద్యమంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 4న జరిగే క్యాబినెట్ భేటీలో రాజధాని వివాదానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. రాజధాని అంశంపై సీఎం జగన్ నేరుగా ప్రకటన చేయాలని కోరుతున్నామని గంటా స్పష్టం చేశారు.

More Telugu News