ESL Narasimhan: తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ... ఇంకా ఖరారు కాని కొత్త గవర్నర్!

  • తొమ్మిదిన్నర సంవత్సరాలకు పైగా బాధ్యతలు
  • బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు
  • కొత్త గవర్నర్ పై రాని స్పష్టత

గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణకు గవర్నర్ గా విధులను నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తెలంగాణ గవర్నర్ కార్యాలయానికి చేరాయా? లేదా? అన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదిన్నర సంవత్సరాలకు పైగా నరసింహన్ గవర్నర్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

ఇక ఆ తరువాత కూడా ఐదేళ్ల పాటు నరసింహన్, రెండు రాష్ట్రాలకూ గవర్నర్ గా వ్యవహరించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబును, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సమన్వయ పరిచేందుకు తనవంతు కృషి చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత నరసింహన్ ను గవర్నర్ గా తొలగించి, బిశ్వభూషణ్ హరిచందన్ ను కొత్త గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి నరసింహన్, తెలంగాణకు మాత్రమే గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సేవలు తెలంగాణ కంటే, జమ్మూకశ్మీర్ లో అవసరమని భావిస్తున్న హోమ్ శాఖ, శ్రీనగర్ లో కీలక బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

ఇక తెలంగాణ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించవచ్చని తెలుస్తోంది. తొలుత కేరళ గవర్నర్ గా ఉన్న సదాశివానికి తెలంగాణ గవర్నర్‌ గా  అదనపు బాధ్యతలను ఇస్తారని వార్తలు వచ్చినా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

More Telugu News