Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు

  • అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
  • మోదీని 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌'గా సంబోధించిన కాంగ్రెస్‌ నేత
  • ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత పరువు నష్టం దావా

ప్రధాని నరేంద్రమోదీని 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌'గా సంబోధించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 3వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రఫేల్‌ ఒప్పందంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్య మాట తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్నే రాహుల్‌ ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు.

పలు ఎన్నికల సభల్లో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ మోదీపై విమర్శలు కురిపించారు. అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీని 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌' గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత మహేష్‌ శ్రీమాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు.

‘ఆయన వ్యాఖ్యలు ఒక్క ప్రధానినే కాదు, భాజపా కార్యకర్తలందరినీ అవమానించినట్లు ఉన్నాయి. గతంలో కూడా రాహుల్‌ ‘కాపలాదారుడే దొంగ’ అని మోదీని పదేపదే విమర్శిస్తూ అగౌరవ పరిచారు’ అంటూ తన పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు.

More Telugu News