Jammu And Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదుల పేరిట బ్యానర్లు.. ఒకరిని చంపిన ముష్కరులు.. సైన్యం అప్రమత్తం

  • శ్రీనగర్ లో నక్కిన ఉగ్రవాదులు
  • పాఠశాలలు, దుకాణాలను మూసివేయాలంటూ బ్యానర్లు
  • ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సైన్యం

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అక్కడ ఉగ్రవాద చర్యలు దాదాపు ఆగిపోయాయి. దీంతో, కశ్మీర్ లోయలో క్రమంగా ఆంక్షలను కూడా ఎత్తివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో... లోయలో ఉగ్రవాదుల పేరిట బ్యానర్లు వెలవడం కలవరపాటుకు గురిచేస్తోంది. కశ్మీర్ లోయలో పాఠశాలలు, దుకాణాలను తెరిస్తే... తగలబెట్టేస్తామంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. దీంతో, సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. కొంతమందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, శ్రీనగర్ లో దుకాణాన్ని తెరిచిన ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, అతను ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనగర్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో... నగరంలో మళ్లీ ఆంక్షలను విధించారు.

More Telugu News