Pawan Kalyan: రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా?: పవన్ కల్యాణ్

  • రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటన
  • తుళ్లూరులో బహిరంగ సభ
  • రాజధానిపై వ్యాఖ్యలు చేసిన జనసేనాని

జనసేనాని పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తన పర్యటన సందర్భంగా తుళ్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, బొత్స చేసిన ప్రకటనలే ఈ గందరగోళానికి కారణం అయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి మారినంత మాత్రాన రాజధానిని కూడా మారుస్తారా? అంటూ ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అంటూ నిలదీశారు.

రాజధానికి అవసరమైన డబ్బును జగన్ తన జేబులోంచి తీసివ్వరని అన్నారు. రాజధానిపై చంద్రబాబు వైఖరే అపోహలకు దారితీసిందని, వేల ఎకరాల మేర భూసేకరణ చేయడంతో అవినీతి జరిగిందన్న అనుమానాలు వచ్చాయని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని తాను మాటిస్తున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. కాగా, పవన్ పర్యటనకు వర్షం ఆటంకం కలిగించడంతో ఆయన కొన్ని ప్రాంతాలను వాహనంలోంచే పరిశీలించారు.

More Telugu News