Nirmala Sitharaman: ఒకే బ్యాంకుగా ఏర్పడనున్న ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూబీఐ: నిర్మలా సీతారామన్ వెల్లడి

  • దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకు ఏర్పడుతుందన్న కేంద్ర ఆర్థికమంత్రి
  • పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు కూడా విలీనం అవుతాయని వెల్లడి
  • దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు ఏర్పడుతుందని వివరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగంపై ఆసక్తికర సమాచారం అందించారు. త్వరలోనే పలు బ్యాంకుల విలీనం జరగనుందని తెలిపారు. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూబీఐ విలీనం కాబోతున్నాయని, ఈ మూడు బ్యాంకులు ఒకే బ్యాంకుగా ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఈ 3 బ్యాంకుల కలయికతో దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకు రూపుదిద్దుకుంటుందని చెప్పారు.

ఇక, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా ఏర్పడబోతోందని మంత్రి వెల్లడించారు. పీఎన్ బీ, ఓబీసీ, యునైటెడ్ బ్యాంకులు ఒకటిగా విలీనం అవుతున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడే బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇవేకాకుండా సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంకు కలిసిపోతుందని, అలహాబాద్ బ్యాంకులో ఇండియన్ బ్యాంకు విలీనం అవుతుందని వివరించారు. తాజా విలీనాల కారణంగా ప్రస్తుతం ఉన్న 27 బ్యాంకుల స్థానంలో ఇకపై 12 బ్యాంకులు మాత్రమే ఉంటాయని తెలిపారు.

More Telugu News