Telangana: పిచ్చి కొడకా.. రా చూపిస్తా.. మంత్రి ఈటల సవాల్

  • ఉద్యమం సమయంలోనే నేను పెద్ద పారిశ్రామికవేత్తను
  • అప్పట్లో నేను ప్రకటించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు
  • నా భార్య, కొడుకు చద్ది కట్టుకుని పౌల్ట్రీకి వెళ్తారు

మంత్రి పదవి తనకు ఎవరో వేసిన భిక్షకాదని వ్యాఖ్యానించి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన మంత్రి ఈటల రాజేందర్ గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే తానో పెద్ద పారిశ్రామికవేత్తనని పేర్కొన్నారు. అప్పట్లోనే తనపేరు అందరికీ తెలుసన్నారు. కేసీఆరే తనను స్వయంగా కమలాపూర్ నుంచి బరిలోకి దింపారని గుర్తు చేశారు. అప్పట్లో తాను ప్రకటించిన ఆస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నారు.

తనపై ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి తాను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్న ఒకేలా ఉంటానని, అదే తమ సంస్కృతి అని అన్నారు. ‘అరే పిచ్చి కొడకా రా.. చూపిస్తా’ అంటూ సవాలు విసిరారు. దొర కొడుకు వచ్చినా.. సఫాయి బిడ్డ వచ్చినా తన టేబుల్ మీద తినగలుగుతారని, ఇలా ఇంకెక్కడా ఉండదని మంత్రి అన్నారు. ఉంటే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. తాను మంత్రి అయినా, ఇప్పటికీ తన భార్య, కొడుకు చద్ది కట్టుకుని పౌల్ట్రీకి వెళ్తారని, కావాలంటే వెళ్లి చూసుకోవాలని మంత్రి ఈటల అన్నారు.

More Telugu News