Etela Rajender: మంత్రి పదవి నాకు ఎవరో వేసిన భిక్ష కాదు.. తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

  • పత్రికల్లో వస్తున్న కథనాలపై ఈటల ఆవేదన
  • మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదని వ్యాఖ్య
  • చిల్లర మల్లర వాదనలకు భయపడే రకాన్ని కాదన్న మంత్రి

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పత్రికల్లో తనపై వస్తున్న ఆరోపణలు, కథనాలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ ఆ వార్తలపై తీవ్రస్థాయిలో స్పందించారు. టీఆర్ఎస్ పార్టీలోకి తాము అడుక్కొని వచ్చినోళ్లం కాదని, తామే ఓనర్లమని వ్యాఖ్యానించి కలకలం రేపారు.

తెలంగాణ గడ్డమీద గులాబీ జెండాను గుబాళింపజేసి మూడున్నర కోట్ల ప్రజల గొంతుకైన వాళ్లమని, రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలమని అన్నారు. తనకు వచ్చిన మంత్రి పదవి ఎవరి భిక్షో కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరుడెవడో తెలిసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చిల్లరమల్లర వాదనలకు తాను భయపడే రకాన్ని కాదని మంత్రి స్పష్టం చేశారు. తానెప్పుడూ వెలిగే దీపాన్నేనని పేర్కొన్నారు.

ఎవరైనా వచ్చి తనకు రూ.5 వేలు ఇచ్చానని చెబితే రాజకీయాల నుంచి తక్షణం తప్పుకుంటానని ఈటల సవాలు విసిరారు. సాయం కోసం ఇంటికి వస్తే ఉత్తి చేతులతో తిప్పి పంపే అలవాటు తనకు లేదన్నారు. తన ఆస్తులపైనా, తన వ్యక్తిగత జీవితంపైనా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News