Andhra Pradesh: రేపటి నుంచి కౌలు రైతులకు చెల్లింపులు చేస్తాం: మంత్రి బొత్స

  • 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి 
  • మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉంది
  • సీఆర్డీఏపై సీఎం సమీక్షలో పాల్గొన్న బొత్స

సీఆర్డీఏపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో బొత్స మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం నిమిత్తం మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారని, వారిలో 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. రేపటి నుంచి కౌలు రైతులకు చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఈ సమీక్షలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని, ఈ సమీక్షలో ముంపు సమస్య చర్చకు రాలేదని అన్నారు.

రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే నాకేం సంబంధం?

రాజధాని అమరావతిని మారుస్తారన్న వ్యాఖ్యలపై బొత్సను మీడియా ప్రశ్నించగా.. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవని అన్నారు. అయినా, రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తన కేంటి సంబంధమని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి గతంలో రూ.35 వేల కోట్లతో టెండర్లు పిలిచారని, ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతానికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.

More Telugu News