Andhra Pradesh: ఏపీ క్రీడాశాఖ మంత్రికి సానియా మీర్జా ఎవరో, పీటీ ఉష ఎవరో తెలియని దుస్థితి!: నారా లోకేశ్

  • ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం
  • క్రీడాకారులకు వైఎస్ ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు    
  • ఫ్లెక్సీలో సానియా మీర్జా చిత్రం..పేరు మాత్రం పీటీ ఉషది

ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్ ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పేరిట క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం సన్మానించాలనుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చిత్రాన్ని ఉంచారు. అయితే, ఆమె పేరును రాసే విషయంలో పొరపాటు జరిగింది. సానియా మీర్జా పేరుకు బదులు నాటి పరుగుల రాణి పీటీ ఉష పేరు రాసి ఉంది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి వారి పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

సానియా మీర్జా ఎవరో, పీటీ ఉష ఎవరో తెలియని దుస్థితిలో ఏపీ క్రీడాశాఖ మంత్రి ఉన్నారని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు గురించి లోకేశ్ ప్రస్తావించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదు ఎకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారని, ఇప్పుడు ఆ అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని, అది చంద్రబాబుగారి దార్శనికత అని కొనియాడారు.  

More Telugu News