Botsa Satyanarayana: 'రాజధాని మార్పు' చర్చపై బొత్స తాజా వ్యాఖ్యలు!

  • ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స
  • రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ
  • తనకు సంబంధం లేదన్న బొత్స

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్పుపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి, తీవ్ర చర్చకు తెరలేపిన మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా, మాట మార్చారు. అమరావతిని మరో ప్రాంతానికి తరలించే విషయంలో జరుగుతున్న చర్చకు, తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల వ్యయం పెరుగుతుందని మాత్రమే తాను చెప్పానని అన్నారు. తన వ్యాఖ్యలపై ఎవరో చర్చలు చేస్తుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు.

కర్నూలు కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, కృష్ణానదికి ఇటీవల 8 లక్షల క్యూసెక్కుల వరద వస్తే, రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని గుర్తు చేశారు. అదే వరదల సమయంలో వర్షాలు కురవకపోవడం అదృష్టమని అన్నారు. ఇది సంతోషించాల్సిన విషయమని చెప్పారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదని మాత్రమే తాను అన్నానని, ప్రతి జిల్లానూ రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యం కోసం తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

More Telugu News