Botsa Satyanarayana: బొత్స వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిలో పర్యటించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

  • రాజధానిపై కాక పుట్టించిన బొత్స వ్యాఖ్యలు
  • ఏపీ రాజధాని మార్పు అంటూ ప్రచారం
  • ఈ నెల 30న అమరావతిలో పవన్ పర్యటన

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. రాజధాని అమరావతి నిర్మాణం అదనపు భారం తప్ప మరొకటి కాదు అనే రీతిలో బొత్స చేసిన వ్యాఖ్యల పట్ల భిన్న స్పందనలు వస్తున్నాయి. టీడీపీ, ఇతర పక్షాలతో పాటు రాజధాని రైతులు కూడా మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, అమరావతి ప్రాంతంలో పర్యటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.

ఈ నెల 30న అమరావతిలో పవన్ పర్యటన ఉంటుంది. మంగళగిరి పాత బస్ స్టాండ్, నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. మొదట గత ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిని పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడతారని పార్టీ వర్గాలంటున్నాయి.

More Telugu News