Hyderabad: తప్పతాగి బస్సు కిందకు బిడ్డను విసిరేసిన తల్లి... చావగొట్టిన ప్రజలు!

  • హైదరాబాద్, కూకట్ పల్లిలో ఘటన
  • భర్తపై కోపంతో బిడ్డను చంపాలనుకున్న సోనీ
  • డ్రైవర్ అప్రమత్తతతో దక్కిన బిడ్డ ప్రాణాలు

తప్పతాగిన మత్తులో కన్న బిడ్డను బస్సుకింద తోసి చంపాలని ఓ తల్లి చూడగా, డ్రైవర్‌ అప్రమత్తతతో స్వల్ప గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సదరు మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీలో ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవిస్తున్న బాలు, సోనీలకు రెండేళ్ల పాప జ్యోతి ఉంది. రోజూ భార్య, భర్త తాగి వచ్చి, ఫుట్ పాత్ పై ఉన్న ఖాళీ స్థలాల్లో నిద్రిస్తుంటారు.

ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, దీంతో నిన్న తప్పతాగిన మత్తులో తన బిడ్డను సోనీ, ఓ బస్సు కిందకు విసిరేసింది. అయితే, ఆమెను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో, పాపకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అప్పటికీ శాంతించని సోనీ, తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని బస్సు ముందు నేలపై కొట్టింది. ఈ మొత్తం ఘటనను గమనిస్తున్న స్థానికులు, అడ్డుకుని, సదరు మహిళను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తల్లీబిడ్డలను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మత్తు దిగిన తరువాత వారిని మహిళా శిశు సంక్షేమ భవనానికి తరలించినట్టు తెలిపారు.

More Telugu News