East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో వైస్ ప్రిన్సిపాల్ అరాచకం.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు

  • కృపారావు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాలిక ఫిర్యాదు
  • ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
  • మహిళా టీచర్లే అలా చెప్పిస్తున్నారన్న కృపారావు

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలోని బాలికల గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. వైస్ ప్రిన్సిపాల్ కృపారావు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం పాఠశాలల జిల్లా సమన్వయకర్త టి.రాధా సుధారాణి గురుకుల పాఠశాలకు వచ్చారు. తొలుత ప్రిన్సిపాల్ వీవీ ప్రశాంతికుమారి, సిబ్బందిని విచారించారు. అనంతరం విద్యార్థినులను విచారించారు. ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ.. వైస్ ప్రిన్సిపాల్ కృపారావు తమను లైంగికంగా వేధిస్తున్నారని చెబుతూ విద్యార్థినులు బావురుమన్నారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థినుల ఆరోపణల నేపథ్యంలో సుధారాణి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

కాగా, విద్యార్థినుల ఆరోపణలపై కృపారావు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కొందరు మహిళా ఉపాధ్యాయులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బాలికతో అలా చెప్పిస్తున్నారని ఆరోపించారు. కాగా, కృపారావుకు ప్రిన్సిపాల్ ప్రశాంతి కుమారి అండగా నిలిచారు. ఆయనపై గతంలో ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు.

More Telugu News