Telangana: తెలంగాణ కేబినెట్‌లోకి కేటీఆర్‌, గుత్తా.. ఇద్దరు మహిళలకు చోటు?

  • అన్నీ కుదిరితే నేడు మంత్రి వర్గ విస్తరణ
  • పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా
  • విస్తరణా?.. పునర్ వ్యవస్థీకరణా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు  కూడా పదవి లభించే చాన్స్ ఉందని సమాచారం. మంత్రి పదవుల జాబితాలో సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. అయితే, ఈసారి కేసీఆర్ పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? లేక మళ్లీ పాక్షికమేనా? అన్నది తెలియరాలేదు.

కేసీఆర్‌కు ముహూర్తాలపై మంచి నమ్మకం ఉంది. ఆయన ఏ పని చేసినా ముహూర్తాలు చూసుకునే ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ రోజు కాకుంటే  వచ్చే నెల 4, 12వ తేదీలలో విస్తరణ కానీ, లేదంటే పునర్ వ్యవస్థీకరణ కానీ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇక, గత కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News