MS Dhoni: ధోనీ ఇప్పటికైనా ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది: గంగూలీ

  • ప్రపంచకప్‌లో ధోనీ ఆటతీరుపై విమర్శలు
  • రెండు నెలలు సెలవు తీసుకున్న ధోనీ
  • ఆలోచించుకోవడానికి ఇదే మంచి సమయమన్న గంగూలీ

ప్రపంచకప్ తర్వాత టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు వెల్లువెత్తాయి. విండీస్‌ టూరుకు వెళ్లకపోవడంతోపాటు క్రికెట్ నుంచి రెండు నెలల సెలవు కోరాడు. ఆ తర్వాత ఆర్మీలో నెల రోజులపాటు సేవలు అందించాడు. కాగా, ప్రపంచకప్‌లో ధోనీ ఒక్క మ్యాచ్‌లోనూ భారత్‌ను గెలిపించేలా ఆడలేదు. దీంతో మరోమారు ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి అతడికి ఇదే మంచి సమయమని మాజీలు సూచించారు.

తాజాగా, ధోనీ ఆటతీరుపై టీమిండియా మాజీ సారథి గంగూలీ మాట్లాడుతూ.. ధోనీ ఇప్పటికైనా తాను మ్యాచ్‌లను గెలిపించగలనో, లేదో నిర్ణయించుకోవాలని అన్నాడు. ‘‘ధోనీ ఇప్పుడా స్టేజ్‌లోనే ఉన్నాడు. తానెక్కడ ఉండాలో విశ్లేషించుకోవాలి. తన ఆటతో మ్యాచ్‌ను గెలిపించగలనో, లేదో నిర్ణయించుకోవాలి. మరెవరిలానో కాకుండా ధోనీలానే జట్టులో ఆడాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. ధోనీ గైర్హాజరీతో విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు స్థానం కల్పించిన విషయం తెలిసిందే.

More Telugu News