Crime News: ప్రేమికుడి ఘాతుకం...గుట్టపైకి తీసుకువెళ్లి గట్టుచప్పుడు కాకుండా చంపేసిన వైనం

  • మెడకు రుమాలు బిగించి హత్య
  • ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఘటన
  • పాలిటెక్నిక్‌ చదువుతుండగా ప్రేమ వ్యవహారం

పాలిటెక్నిక్‌ చదువుతుండగా ప్రేమించిన అమ్మాయి అడ్డు తొలగించుకునేందుకు ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి ఆమెను జనసంచారంలేని గుట్టపైకి తీసుకువెళ్లి హత్య చేశాడు. చివరికి గుట్టు రట్టు కావడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కుప్పిన కుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన నితిన్‌లు గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదివేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమపుట్టి ఇప్పటికీ కొనసాగుతోంది. పాలిటెక్నిక్‌ తర్వాత నితిన్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరగా, తేజస్విని కొన్ని సబ్టెక్టులు తప్పడంతో ఇంట్లోనే ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తేజస్వినిని నితిన్‌ తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి సమీపంలోని గుట్టపైకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను చంపి పడేశాడు. కుమార్తె కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్‌డేటాలో నితిన్‌ నంబర్‌ గుర్తించారు.

అతను ఖమ్మం వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి ఘటనా స్థలి నుంచి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News