Sujana Chowdary: బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరిన సుజనా చౌదరి

  • రాజధానిని మార్చడం చెప్పినంత ఈజీ కాదు
  • అమరావతిలో ఇప్పటికే ఎన్నో పనులు జరిగాయి
  • ఈ అంశంపై జగన్ స్పందించాలి

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీ రాజధానిని మార్చడం చెప్పినంత సులువు కాదని అన్నారు. కొందరు రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన అనుమతితోనే అమరావతి నిర్మాణం జరిగిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజధానిపై నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మంత్రి బొత్సపై సుజనా చౌదరి మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో తనకు ఒక సెంటు స్థలం ఉందేమో నిరూపించాలని సవాల్ విసిరారు.

More Telugu News