Guntur District: గుంటూరు జనసేన కార్యాలయం ఖాళీ... యజమానికి అప్పగింత!

  • గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్ లో కార్యాలయం
  • స్వయంగా ప్రారంభించిన రావెల కిశోర్ బాబు
  • ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ కు ఇస్తానంటున్న యజమాని

గుంటూరు నగర శివారులో ఉన్న గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఖాళీ అయింది. ఈ భవనాన్ని జనసేన నేతలు యజమానికి తిరిగి అప్పగించడంతో, అక్కడ టూలెట్ బోర్డు ఏర్పడింది. అయితే, అంతకుముందు జనసేన కోసం పెట్టుకున్న లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను మాత్రం ఇంకా తొలగించలేదు.

ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని పేర్కొనడం గమనార్హం. ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ భవంతిలో జనసేన, తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు కూడా. దీంతో కార్యాలయం అతీగతీ పట్టించుకునే వారు లేకపోయారు. కాగా, గుంటూరుతో పాటు పలు పట్టణాలు, నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News