Vizag: నడిపించేది ఎవరో తెలియని హైటెక్ వ్యభిచారం... విశాఖ పోలీసుల అవాక్కు!

  • విశాఖ హోటల్ లో వ్యభిచారం
  • పోలీసులు వెళ్లేసరికి వెళ్లిపోయిన విటులు
  • ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిర్వాహకుడి కోసం గాలింపు

ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసిన పోలీసులు, విచారించిన తరువాత, వెల్లడైన నిజాలను చూసి అవాక్కయ్యారు. ఈ కేసులో తమను నగరానికి పిలిపించి, వ్యభిచారం చేయిస్తున్న దళారీ ఎవరో ఆ అమ్మాయిలకు తెలియదు. కేవలం రిషి అనే పేరు మాత్రమే తెలుసు. దీంతో ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా రిషిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ ను నియమించారు.

విశాఖ టూ టౌన్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, నగరంలోని విశాఖ ఇన్ హోటల్ లో వ్యభిచారం జరుగుతూ ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేయగా, ముంబై, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు చిక్కారు. వారిని విచారించగా, ముంబైకి చెందిన యువతి 20 వ తేదీన, బెంగళూరుకి చెందిన యువతి 22న విమానంలో నగరానికి వచ్చి అల్లిపురంలోని విశాఖ ఇన్‌ హోటల్‌ లో తమ పేరిట బుక్ చేసివున్న గదిలో దిగారు. రిషి అనే వ్యక్తి, వారి వద్దకు విటులను పంపేవాడు. కేవలం వారి పేరు మాత్రమే చెబుతాడు. అతను వచ్చాడని తెలిస్తే, వారు అతనితో గడపాల్సివుంటుంది. ఒక్కో కస్టమర్ కు రూ. 1,500 చొప్పున రిషి వీరికి ఇస్తాడు.

తాము ఎక్కడికి వెళ్లాలన్న విషయాన్ని అతనే చెబుతాడని, తమకు విమానం టికెట్లను కూడా బుక్ చేసి మెయిల్ లో పంపుతాడని వారిద్దరూ చెప్పారు. ఏ నగరానికి వెళ్లినా, హోటల్, కారు తదితరాలన్నీ అతనే చూసుకుంటాడని, తాము కేవలం రెండు రోజులు ఉండి, మరో ప్రాంతానికి వెళ్లి పోతుంటామని చెప్పారు. విటులు నేరుగా రిషిని సంప్రదించి, తమ వద్దకు వస్తారని, వారి ఫోన్ నంబర్లు తమకు తెలియవని అన్నారు. కాగా, పోలీసులు తనిఖీలకు వచ్చే సమయానికి వారిద్దరి గదుల్లో విటులెవరూ లేకపోవడం గమనార్హం. దీంతో ఇద్దరు యువతులను పునరావాస కేంద్రానికి తరలించామని, హోటల్ లో పూర్తిస్థాయి తనిఖీలు చేశామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. రిషి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.

More Telugu News