Hyderabad: కన్న బిడ్డను అమ్మేసుకుని... కిడ్నాప్ డ్రామా ఆడిన తల్లి!

  • హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘటన
  • బిడ్డను పెంచలేక విక్రయించిన యాచకురాలు
  • ఆపై పోలీసులకు ఫిర్యాదు

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను పెంచే స్థోమతలేదని భావించిన ఓ తల్లి, బిడ్డను అమ్మేసింది. ఆపై కిడ్నాప్‌ డ్రామా ఆడింది. తన బిడ్డను ఎవరో ఎత్తుకుని వెళ్లారంటూ, పోలీసుల ముందు బావురుమంది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, ఆమె బాగోతాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్, ఎల్బీ నగర్‌ పోలీసుల కథనం ప్రకారం, సికింద్రాబాద్‌ కు చెందిన డేరంగుల వరలక్ష్మి (30) యాచక వృత్తిలో ఉంది. ఆమెకు అఖిల్‌ (11 నెలలు) అనే కుమారుడున్నాడు.

ఇటీవలే ఆమె కుమారుడితో పాటు భిక్షాటన చేస్తుండగా, కళ్లు తిరిగి పడిపోయానని, లేచి చూస్తే బిడ్డ కనిపించలేదని, ఇద్దరు వ్యక్తులు బాబును బైకుపై ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. తనకు ఒరుగంటి మోష అనే వ్యక్తిపై అనుమానం ఉందని చెబుతూ, బైక్ నంబర్ కూడా ఇచ్చింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు, మోషను అరెస్ట్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది.

వరలక్ష్మి తనకు బాబును రూ. 60 వేలకు విక్రయించిందని మోష పోలీసులకు చెప్పాడు. ఇప్పుడిలా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేసిందో తెలియడం లేదన్నాడు. దీంతో బాలుడిని స్వాధీనం చేసుకుని శిశువిహార్‌ కు తరలించిన అధికారులు, వరలక్ష్మిని అరెస్టు చేశారు. కేసును విచారిస్తున్నామన్నారు. బిడ్డను పెంచలేకనే వరలక్ష్మి, ఈ పని చేసిందని, మోషపైనా కేసును పెట్టామని అధికారులు తెలిపారు. 

More Telugu News