Pawan Kalyan: ఏపీ రాజధానిగా అమరావతే సరైంది.. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదు: పవన్ కల్యాణ్

  • రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది
  • రాజధాని మార్పుకు జనసేన వ్యతిరేకం
  • అమరావతి రైతులకు అండగా ఉంటాం

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజధానిగా అమరావతే సరైన ప్రాంతమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదని... దీన్ని జనసేన వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పారు. రాజధాని కోసం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు త్యాగం చేశారని కొనియాడారు.

కొందరు ఇష్టంగా భూములు ఇచ్చారని, మరికొందరు అయిష్టంగా ఇచ్చారని... అందుకే గతంలో తాను భూసేకరణ వద్దని రైతుల పక్షాన నిలబడ్డానని తెలిపారు. ఏదేమైనా రైతులు రాష్ట్రం కోసం పొలాలను వదులుకున్నారని చెప్పారు. రాజధాని అనేది కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని... రాష్ట్ర సమస్య అని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలని.. మొత్తానికే రద్దు చేస్తామని చెప్పడం తగదని అన్నారు. రాజధాని రైతులకు అండగా జనసేన ఉంటుందని చెప్పారు.

More Telugu News