Telangana: మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు కురిపించింది!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • కొందరు వ్యక్తులు దీనిపై తప్పుడు ప్రచారం చేశారు
  • నీతిఆయోగ్ మిషన్ కాకతీయకు జై కొట్టింది
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడానికి కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి. తాజాగా  ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కొందరు వ్యక్తులు మిషన్ కాకతీయ పథకంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకానికి మద్దతు తెలిపిందని కేటీఆర్ చెప్పారు.

నీతిఆయోగ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో 22,500 చెరువులను పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు.

More Telugu News