Ambati Rayudu: రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం: అంబటి రాయుడు

  • మళ్లీ భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని తపిస్తున్నా
  • ఇండియా తరపున లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడుతా
  • ఐపీఎల్ లో కొనసాగుతా

ప్రపంచకప్ కు తనను ఎంపిక చేయకపోవడంతో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అయితే, తన రిటైర్మెంట్ ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తాజాగా తెలిపాడు. ఆవేశంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోలేదని... జట్టులో చోటు దక్కనప్పుడు నిరాశకు గురి కావడం సహజమేనని చెప్పాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత... మళ్లీ ఆలోచించానని తెలిపాడు. మళ్లీ భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని తపిస్తున్నానని చెప్పాడు. భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని... ఐపీఎల్ లో కొనసాగుతానని తెలిపాడు. ప్రపంచకప్ లో చోటు సాధించాలని నాలుగైదు ఏళ్లు శ్రమించానని... అయినా, చోటు దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానని చెప్పాడు.

ఇప్పటికిప్పుడే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన తనకు లేదని రాయుడు తెలిపాడు. జట్టులో స్థానం కోసం తాను ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లాల్సి ఉందని చెప్పాడు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు.

More Telugu News