Tirumala: తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం పట్ల స్వరూపానంద ఆగ్రహం

  • బస్ టికెట్ల వెనుక హజ్, జెరూసలెం యాత్రల వివరాలు
  • ఇది దుర్మార్గపు చర్య అంటూ స్వరూపానంద మండిపాటు
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జారీ చేసిన జీవోను జగన్ సర్కారు అమలు చేయాలంటూ సూచన

తిరుమల బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన వివరాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమల బస్ టికెట్ల వెనుక హజ్, జెరూసలెం యాత్రల వివరాలు ముద్రించారు. దీనిపై స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే దుర్మార్గపు చర్యలని స్వరూపానంద తీవ్రస్థాయిలో స్పందించారు.

ఇది కుట్రగా భావిస్తున్నామని, దీనికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హిందూ పుణ్యక్షేత్రాల పరిసరాల్లో అన్యమత ప్రచారాన్ని నిరోధించేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఓ జీవో తీసుకువచ్చారని, ఇప్పుడా జీవోను జగన్ సర్కారు తప్పకుండా అమలు జరిగేలా చూడాలని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలను ఉపేక్షించడం ప్రభుత్వానికి తగదని విశాఖ శారదా పీఠాధిపతి హితవు పలికారు.

More Telugu News