Nirmala Sitharaman: సర్ చార్జి నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపు.. కేంద్రం సానుకూలం!

  • బడ్జెట్ సందర్భంగా సర్ చార్జి పెంచుతూ కేంద్రం నిర్ణయం
  • సర్ చార్జి పెంపుతో అమ్మకాలకు పాల్పడిన విదేశీ కార్పొరేట్ ఇన్వెస్టర్లు
  • మార్కెట్ల మందగమనంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు

విదేశీ పోర్ట్ ఫోలియా పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా కేంద్రం కీలకచర్యలకు ఉపక్రమించింది. అత్యంత ధనవంతులపై విధించే సర్ చార్జి నుంచి వారికి మినహాయింపు కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలే బడ్జెట్ సందర్భంగా, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం కలిగి పన్ను కడుతున్న వ్యక్తులపై సర్ చార్జిని 10 నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగి పన్ను కడుతున్న వ్యక్తులపై సర్ చార్జిని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు.

ఈ నిర్ణయం విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపింది. సూపర్ రిచ్ కేటగిరీ పేరుతో  పెరిగిన సర్ చార్జి చెల్లించేందుకు ఇష్టపడని విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు మొగ్గుచూపారు. ఇది దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది.

అత్యంత ధనవంతులపై విధించే సర్ చార్జి పరిధి నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లను తప్పించాలని ఆర్థికమంత్రి సీతారామన్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అంతకుముందు ఇదే విషయమై విదేశీ పెట్టుబడిదారులు నిర్మలా సీతారామన్ తో సమావేశమై సర్ చార్జిపై సమీక్షించాలని కోరారు.

More Telugu News