Tamilnadu: మా రోడ్డు మీదుగా దళితుడి శవాన్ని పోనివ్వం.. అంతిమయాత్రను అడ్డుకున్న అగ్రవర్ణాలు!

  • తమిళనాడులోని వెల్లూరులో ఘటన
  • రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుప్పన్
  • బ్రిడ్జీ పై నుంచి మృతదేహాన్ని శ్మశానానికి చేర్చిన దళితులు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇంకా కుల వివక్ష ఇంకా తగ్గలేదు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. చనిపోయిన ఓ దళితుడి భౌతికకాయాన్ని తమ వీధి గుండా తీసుకెళ్లేందుకు వీల్లేదని అగ్రవర్ణాల వారు స్పష్టం చేశారు. దీంతో మరో మార్గం లేక ఓ వంతెన పై నుంచి తాళ్లతో మృతదేహాన్ని సమాధిలోకి చేర్చారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

వెల్లూరు జిల్లాలోని నారాయణపురం గ్రామానికి చెందిన కుప్పన్(55) రోడ్డు ప్రమాదంలో ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే గ్రామంలోని దళితులకు శ్మశానం లేకపోవడంతో అందర్నీ ఒకేచోట పూడ్చిపెడుతున్నారు. అయితే వీరు శ్మశానానికి వెళ్లాలంటే అగ్రవర్ణాల ఇంటి ముందున్న రోడ్డు నుంచే వెళ్లాలి.

అయితే ఇందుకు వెల్లల గౌండర్లు, వెన్నియార్ కులస్తులు ఒప్పుకోలేదు. దీంతో రోడ్డుపై నుంచి వెళ్లకుండా 20 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జీ నుంచి తాళ్ల సాయంతో మృతదేహాన్ని శ్మశానంలోకి దించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. గత 20 ఏళ్లుగా ఈ అగ్రవర్ణాల హిందువులు తమను ఇదే తరహాలో వేధిస్తున్నారని దళితులు వాపోయారు.

More Telugu News