chidambaram: చిన్న గదిలో చిదంబరం... ఒక రాత్రి గడిచిందిలా!

  • నిన్న చిదంబరం అరెస్ట్
  • సీబీఐ గెస్ట్ హౌస్ 5వ నంబర్ గదిలో రాత్రంతా
  • దాదాపు మేలుకునే ఉన్న చిదంబరం

నిన్న రాత్రి పది గంటల సమయంలో సీబీఐ, ఈడీ అధికారులు, ఢిల్లీ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి పళనియప్పన్ చిదంబరం నిన్న రాత్రంతా ఓ చిన్న గదిలో కాలం వెళ్లబుచ్చారు. తొలుత చిదంబరాన్ని తమతో పాటు తీసుకెళ్లిన పోలీసులు, సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు.

చిదంబరం షుగర్, బీపీ, పల్స్ స్థాయులను రికార్డు చేసిన వైద్యులు, ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పడంతో సీబీఐ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ హౌస్ లోని 5వ నంబర్ గదిలో ఉంచారు. ఏమైనా తింటానికి కావాలా? అని అధికారులు ప్రశ్నించగా, తనకు ఏమీ వద్దని చిదంబరం వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఆపై కావాలంటే, ఇంటి నుంచి డిన్నర్ తెప్పించుకోవచ్చని అధికారులు చెప్పినా, అప్పటికే సమయం మించి పోవడంతో, సున్నితంగా తిరస్కరించిన చిదంబరం, రాత్రంతా దాదాపు మేలుకునే ఉన్నట్టు తెలుస్తోంది. నేడు ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పరచనున్న అధికారులు, ఆ వెంటనే కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News